భారీగా పెరిగిన అంబాని సంపద.!
రిలయన్స్ ఇండస్ట్రీ షేర్లు సోమవారం (సెప్టెంబర్ 6) బీఎస్ఈలో 1.70 శాతం పెరిగి రూ.2,429.00 వద్ద నిలిచాయి. గత వారం, స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్ లో రూ.393 కోట్ల వాటాను కొనుగోలు చేసినట్లు ప్రకటించింది రిలయన్స్ స్ట్రాటజిక్ బిజినెస్ వెంచర్స్ లిమిటెడ్. ఆర్ఐఎల్ అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ సెప్టెంబర్ 1, 2021 నుంచి అమల్లోకి వచ్చిన సెబీ నిబంధనలకు అనుగుణంగా జస్ట్ డయల్ లిమిటెడ్ పై నియంత్రణ తీసుకున్నట్లు వెల్లడించింది.
లోకల్ సెర్చ్ ఇంజిన్ జస్ట్ డయల్లో 40.95% వాటాలు కొనుగోలు చేసినట్టు రిలయన్స్ రిటైల్ కంపెనీ ప్రకటించింది. ఇక జియో ఇన్ఫోకామ్ అతి తక్కువ రేట్లకు ఇంటర్నెట్ అందిస్తూ ప్రత్యర్ధులకు కొరకరాని కొయ్యగా మారి టెలికామ్ రంగంలో సవాలుగా నిలిచింది. ప్రస్తుతం జియో భారతదేశంలో అతిపెద్ద వైర్ లెస్ సర్వీస్ ప్రొవైడర్ గా నిలిచింది. 2021, జూన్ చివరి నాటికి 43.66 కోట్ల మంది చందాదారులను కలిగి ఉన్న అతి పెద్ద టెలికామ్ రంగం కంపెనీగా నిలిచింది జియో.
అలాగే, రిలయన్స్ నుంచి అతి తక్కువ ధరకే 5 జీ స్మార్ట్ఫోన్ విడుదల చేయనున్నట్టు ఆ కంపెనీ అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే అనేక రంగాల్లో ముఖేష్ అంబాని అండ్ కో తిరుగులేని శక్తిగా మారారు.