మా ఇంటికొస్తే ఏం తెస్తావ్? మీ ఇంటికొస్తే ఏమిస్తావ్?
ప్రపంచంలోనే పెద్ద మార్కెట్గా ఉన్న భారత్ను ఉపయోగించుకోవాలని ప్రతి పారిశ్రామికవేత్త కలలు కంటుంటారు. ఆ కలలను సాకారం చేసుకునే క్రమంలో స్వప్రయోజనాలతోపాటు ప్రజా ప్రయోజనాల గురించి ఆలోచించేవారు కొందరే ఉంటారు. టాటాలు ఆ కోవలో ప్రథమస్థానంలో నిలుస్తారు. టెస్లా కంపెనీ అధినేత ఎలన్మస్క్ మాత్రం చివరిస్థానంలో నిలుస్తారు. ఎందుకంటే ఆయనకు తన కార్లను భారత్లో అమ్ముకోవాలంటే పన్నురాయితీ ఇవ్వాలంటున్నారు. అలా కాని పక్షంలో ఏదోఒక విధంగా మైండ్గేమ్ ఆడి దేశాన్నే ఇరుకున పెట్టాలని చూస్తారు.
పన్నురాయితీ ఇవ్వాలని కోరుతున్నారు.
తన కార్లను భారత్లో అమ్ముకోవడానికి భారీగా పన్నురాయితీ ఇవ్వాలని కోరారు. దిగుమతి పన్నులు ఎక్కువగా ఉన్నాయని, వాటిని తగ్గించగలిగితే తమ కార్లను తీసుకొస్తామన్నారు. అలాగే ఇస్తాంకానీ మీ ప్లాంట్ను భారత్ లో నెలకొల్పండి అని కేంద్ర ప్రభుత్వానికి చెందిన సీనియర్ అధికారి ఒకరు బదులిచ్చారు. దాంతో ఆయనకు ఏం చేయాలో పాలుపోలేదు. టెస్లా కోరినట్లుగా దిగుమతి పన్నులు తగ్గించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఆ కంపెనీ తన తయారీ యూనిట్ను ఇక్కడ పెట్టాలని ఆయన కోరారు. తాము ఇచ్చే రాయితీ టెస్లా ఒక్కదానికే వర్తించదని ప్రపంచంలో ఎవరికైనా వర్తిస్తుందన్నారు. ఒకరకంగా మన ప్రభుత్వం ఇచ్చిన సమాధానంతో ఎలన్మస్క్కు గొంతులో పచ్చివెలక్కాయ పడినట్లైంది.
చైనా, జర్మనీలోనే తయారుచేస్తారు..
అమెరికాలో కాకుండా చైనా, జర్మనీలోనే ఆయన కార్ల తయారీ యూనిట్లున్నాయి. అక్కడినుంచి భారత్కు దిగుమతి చేసి అమ్మాలనేది టెస్లా వ్యూహంగా ఉంది. దిగుమతి చేసుకున్న కారు సుంకంతో కలిపి రూ.2 కోట్ల అవుతుందని పరిశ్రమవర్గాలంటున్నాయి. తమ ప్రభుత్వం రూపొందించిన ఎలక్ట్రిక్ కారును లగ్జరీ కారుగా చూడొద్దని, దానికి దిగుమతి పన్నులు మాత్రమే తగ్గించాలని తాము కోరుతున్నట్లు ఎలన్మస్క్ అంటున్నారు. ఆ కంపెనీ అడిగినట్లుగానే రాయితీ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైనప్పుడు తయారీ యూనిట్ ఇక్కడ ఏర్పాటు చేయవచ్చుకదా అని పరిశ్రమవర్గాలంటున్నప్పటికీ ఆయన్నుంచి సానుకూల దృక్పథం మాత్రం వ్యక్తం కావడంలేదు.