ఆంధ్రప్రదేశ్ కు విశాఖపట్నం త్వరలో ఏకైక రాజధాని అయ్యే అవకాశాలున్నాయని కూడా ఓ టాక్ వినిపిస్తోంది. వచ్చే ఉగాది వరకు ఈ విషయంపై ఓ క్లారిటీ రానున్నది. అయితే ఆలోపు విశాఖను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని జగన్ ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. విశాఖ నగరంలో పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు పలువురు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ తరుణంలోనే గ్రేటర్ విశాఖ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 2 ఎకరాలలో రూ.20కోట్లు అంచెనా వ్యయంతో ఈ స్నో పార్కు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు అధికారులు.
ముఖ్యంగా మంచులో బాస్కెట్ బాల్ ఆట ఆడుకునేలా సౌకర్యాలు కల్పించాలని, ఓ హోటల్ కూడా ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించినట్టు తెలుస్తున్నది. విశాఖలో స్నో పార్కు ఏర్పాటు చేయడానికి డీపీఆర్ తయారుచేయడానికి విశాఖ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ అధికారులు ప్రణాళికలు రచిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఈ పార్కును పర్యాటకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దాలని ఏపీ ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది. విశాఖలోని బీచ్ రోడ్డులో స్నో పార్కు ఏర్పాటు చేసే అవకాశం ఉన్నదని వెల్లడించారు స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్ గన్నమనేని వెంకటేశ్వరరావు.