ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వర రావు ఇంట్లో విషాద ఛాయలు నెలకొన్నాయి. దేవినేని ఉమ తండ్రి దేవినేని శ్రీమన్నారాయణ (చిన్ని) మృతి చెందారు. విజయవాడలోని రమేష్ ఆసుపత్రిలో గుండెపోటుతో ఆయన మృతిచెందినట్టు కుటుంబసభ్యులు పేర్కొంటున్నారు. ఆయన వయస్సు 88 సంవత్సరాలు ఉంటుంది. కంకిపాడు మండలం నెప్పల్లి శ్రీమన్నారాయణ స్వగ్రామం అయితే ఆయన కంచికచర్లలో స్థిరపడ్డారు. క్రియాశీలక రాజకీయాల్లో ఎప్పుడూ పాల్గొనకపోయినప్పటికీ ఆయన ఇద్దకు కుమారులు స్వర్గీయ దేవినేని వెంకటరమణ, దేవినేని ఉమామహేశ్వరరావుల ఎన్నికల ప్రచారంలో కొన్ని సందర్భాలలో మాత్రం పాల్గొన్నారు. ఆయనకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె కలరు. ఇవాళ కంచికచర్లలో అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లను చేపడుతున్నారు.
మరోవైపు శ్రీమన్నారాయణ మృతికి పలువురు టీడీపీ, ఇతర పార్టీలకు చెందిన నేతలు సంతాపం తెలిపారు. ఆయన మరణవార్త విన్న వెంటనే దేవినేని అవినాష్ విజయవాడ రమేష్ హాస్పిటల్ వద్దకు చేరుకుని నివాళులర్పించారు. దేవినేని నెహ్రూ సతీమణి లక్ష్మీ, బాజీ సతీమణి, టీడీపీ కార్పొరేటర్ దేవినేని అపర్ణ, దేవినేని చందులు వినయ్ ఆస్పత్రి వద్ద నివాళులర్పించారు. అనంతరం కంచికచర్లలో పలువురు ఆయన పార్థివదేహానికి నివాళులర్పించారు. టీడీపీ నేతలు సహా వివిధ పార్టీలకు చెందిన నేతలు ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నారు.