డీజీపీకి తెలిసే దాడులు జరిగాయా?
రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటాయని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత నక్కా ఆనంద్బాబు వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. డీజీపీకి తెలిసే, ఆయన కనుసన్నల్లోనే తెదేపా కార్యాలయాలు, నేతల ఇళ్లపై దాడులు జరిగాయని ఆరోపించారు. ప్రభుత్వం ప్రజల హక్కులను హరించివేస్తోందని, వాటిని కాలరాచేలా ప్రభుత్వ పనితీరు ఉందంటూ ఆయన దుయ్యబట్టారు. అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అరాచకాలకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారని, భవిష్యత్తులో ఈ వత్తాసుకు తగిన మూల్యం చెల్లించకతప్పదని హెచ్చరించారు. కళ్లముందే దాడులు జరుగుతున్నా పోలీసులు నిలువరించడం మానేశారని, వారికి ముందస్తుగా సమాచారం ఉన్నా నిరోధించడానికి ప్రయత్నించలేదని మంత్రి మండిపడ్డారు. ఎన్నిరోజులు ఈ అరాచక పాలన సాగుతుందో అన్నిరోజులు అన్నివిషయాలను ప్రజలు గుర్తుపెట్టుకుంటారని, రాబోయే ఎన్నికల్లో వీరికి తగిన గుణపాఠం చెప్పక తప్పదని, అందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ప్రభుత్వ పనితీరు చూసి ఇతర రాష్ట్రాలవారు నవ్వుకుంటున్నారన్నారు.