ప్రతిపక్షాలు చంద్రబాబును సమర్థించడం తప్పా?
ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలుగుదేశం పార్టీని నిషేధించాలంటూ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా జనసేన అధినేత పవన్ కల్యాణ్, భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు చంద్రబాబును సమర్ధించడం సిగ్గుచేట్టన్నారు. మావోయిస్టులకు, తెలుగుదేశం పార్టీకి తేడా ఏమీలేదని, తెలుగుదేశం పార్టీని నిషేధించాలని ఎన్నికల సంఘాన్నికోరతామన్నారు. రాష్ట్రంలో ఏం జరిగిందో ప్రజలంతా చూశారు. తప్పు ఏ పార్టీది అన్నది అందరికీ అర్థమైంది. అలాగే ఎవరెవరు ఏ పార్టీకి చెందినవారు, ఏ పార్టీకి చెందిన నేతలపై, కార్యాలయాలపై రాష్ట్రవ్యాప్తంగా దాడులకు పాల్పడ్డారో చూశారు. అంతేకాకుండా విధ్వంస రచన ఏపీలో సాగిందని అర్థం చేసుకోవచ్చని ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇటువంటి తరుణంలో మంత్రి బొత్స తెదేపాను నిషేధించాలని ఎన్నికల సంఘాన్ని కోరతామనడం హాస్యాస్పదంగా ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తప్పు చేసినవారు ఆ తప్పులను ఎదుటివారిపై రుద్దే ప్రయత్నంలాంటిదని, ప్రజలంతా వాస్తవ పరిస్థితులను గమనిస్తున్నారని, అయినా బుకాయింపు రాజకీయాలను బొత్స ఎందుకు చేస్తున్నారో అర్థం కావడంలేదంటున్నారు.