ఏపీలో గుండు కొట్టించుకుంటే పన్నా?
ఏపీలో విద్యుత్తు చార్జీల బాదుడుపై బీజేపీ నేత లంకా దినకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో విద్యుత్తు వాడినా, వాడకున్నా ప్రభుత్వం చార్జీల బాదుడు తప్పడంలేదన్నారు. ముందు ట్రూఅప్ చార్జీలు అంటే ఏమో అనుకున్నామని.. కానీ నిజం ఏమిటంటే విద్యుత్తు వాడకపోతే బాదే బాదుడు నభూతో నభవిష్యత్ అన్నారు. రాష్ట్రంలో ఒక గృహవిద్యుత్ వినియోగదారుడు గత నెల 71 యూనిట్లు వాడితే బిల్లు రూ.243 వచ్చిందని, ఈ నెల వినియోగం " 0" యూనిట్లకు రూ.303 బిల్లు వచ్చిందని ఇంతకంటే నిదర్శనం ఏమికావాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో జుట్టు ఉన్న లేదా గుండు కొట్టించుకున్నా పన్ను వేసే పరిస్థితి నెలకొందని, ఇదంతా ఒక తుగ్లక్ పాలనను గుర్తుకు తెస్తోందని విమర్శించారు. ఇప్పటికే ఏపీలో ట్రూఅప్ ఛార్జీల బాదుడుపై తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో కేంద్రం బాదుతుంటే, మరోవైపు రాష్ట్రం విద్యుత్తు ఛార్జీల బాదుడు పేరుతో ప్రజలను మోసం చేస్తున్నాయని లంకా దినకర్ నిప్పులు చెరిగారు.