కళా 'మా' తల్లి: రాజీనామాలు అందలేదు..!
మా అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు తన తండ్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రకాష్ రాజ్ ప్యానెల్ తరఫున రాజీనామాలు చేసిన సభ్యుల లేఖలు అందలేదని, వారు రాజీనామా చేశారనే విషయం తనకు మీడియాద్వారా మాత్రమే తెలిసిందన్నారు. రాజీనామా లేఖలు అందిన తర్వాత అప్పటి పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటానన్నారు. వెంకటేశ్వరస్వామివారి దయవల్ల మా అధ్యక్షుడిగా గెలుపొందానని, కృతజ్ఞతలు తెలుపుకునేందుకు తిరుమల వచ్చినట్లు విష్ణు చెప్పారు. ఎన్నికల్లో తన ప్యానెల్ ఎంతో కష్టపడిందన్నారు. స్వామివారి ఆశీస్సులతో మాను అభివృద్ధి చేస్తానన్నారు. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానెల్స్ మా అధ్యక్ష పదవి కోసం హోరాహోరీగా తపడిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో విష్ణు భారీతేడాతో విజయం సాధించడంతో ప్రకాష్ రాజ్ ప్యానెల్ తరఫున గెలిచిన 11 మంది సభ్యులు రాజీనామాలు సమర్పించారు. మోహన్బాబు, సీనియర్ నరేష్ వల్ల తాము మాలో ఇమడలేమని, బయటనుంచి విష్ణుకు మద్దతిస్తామని ప్రకటించారు. అయితే వీరి రాజీనామాపై విష్ణు ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు.