త్వరలో జగనన్న 'విసనకర్ర' పథకం?
ఆంధ్రప్రదేశ్లో త్వరలోనే వైఎస్ జగన్ ప్రభుత్వం విసనకర్ర పథకం ప్రవేశపెట్టబోతోందంటూ సామాజిక మాధ్యమాల్లో జోరుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రాష్ట్రంలో విద్యుత్తు కోతలు అమలవుతుండటంతోపాటు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా మీడియా ముందుకు వచ్చి కోతలుంటాయని, బొగ్గు కొరత తీవ్రంగా ఉందని, అయినప్పటికీ అందుబాటులో బొగ్గుంటే ఎక్కువ ధర చెల్లించైనా కొనడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. అలాగే సాయంత్రం ఆరుగంటల నుంచి రాత్రి పదిగంటల వరకు ఏసీలు వాడకం ఆపేయాలని సూచించారు. దీనిపై నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఏపీ అంధకారంలోకి వెళ్లనుందని, ఫ్యాన్లు తిరగవని, ఏసీలు ఎవరైనా వాడుతున్నారేమో తెలుసుకోవడానికి వాలంటీర్లు ఉపయోగిస్తారని పోస్టులు పెడుతున్నారు. గాలి ఆడకపోతే జగనన్న విసనకర్ర పథకం పెడతారంటూ పోస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ పథకం గురించి రాష్ట్రం మొత్తం ఒక సంచలనంగా మారింది. కొంతమందైతే నిజమేనా అని అడుగుతున్నారు. ఏదేమైనా కానీ ఏపీ ప్రభుత్వం ముందుచూపు లేకుండా వ్యవహరించి విద్యుత్తు కొరత విషయంలో ప్రజల్లో నవ్వులపాలవుతోంది.