ద్వారకా తిరుమల: నేటి నుంచి బ్రహ్మోత్సవాలు
ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామివారి ఆలయంలో శుక్రవారం నుంచి ఈ నెల 22వ తేదీ వరకు అశ్వయుజ మాస బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. శుక్రవారం స్వామి, అమ్మవార్లను పెళ్లి కొడుకు, పెళ్లి కూతుర్లుగా అలంకరించి ఊరేగింపు జరపనున్నారు. 16న ధ్వజారోహణ, 18న ఎదుర్కొలు, 19 న స్వామివారి కల్యాణం, 20 న రథోత్సవం, 22 న స్వామివారి పవళింపుసేవతో ద్వారకా తిరుమల బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో ఆర్జిత సేవలు, ఆర్జిత కల్యాణాలు రద్దు చేశామని, భక్తులంతా కరోనా నిబంధనలు పాటిస్తూ స్వామివారిని, అమ్మవారిని దర్శించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అలాగే కరోనా నియమ నిబంధనలను పాటిస్తూ బ్రహ్మోత్సవాలు జరుగుతాయని వెల్లడించారు. దసరా ఉత్సవాల్లో భాగంగా ద్వారకా తిరుమల కుంకుళ్ళమ్మ ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చి అభయమివ్వనున్నారు. ఇక్కడ కూడా అధికారులు కరోనా నియమ నిబంధనలకు అనుగుణంగా భక్తులకు ప్రవేశాలు కల్పిస్తున్నారు.