కరోనా: ఇదే చివరి అవకాశం?
కరోనా ప్రపంచానికి పరిచయమై రెండు సంవత్సరాలు కావస్తోంది. కానీ ఇంతవరకు వాటి మూలాలను కనుగొనడంలో ప్రపంచం మొత్తం వెనకబడింది. ప్రపంచానికి తాను పెద్దన్నగా చెప్పుకునే అమెరికా కానీ, ఆ అమెరికా చేతిలో పావుగా ఉపయోగపడే ఐక్యరాజ్యసమితికానీ, దాని అనుబంధ సంస్థ ప్రపంచ ఆరోగ్య సంస్థకానీ ఇంతవరకు మూలాలను కనిపెట్టలేకపోయాయి. చైనాలోని వుహాన్లోని లాబ్ నుంచి ఈ వైరస్ బయటకు వ్యాపించి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ పెడసరి చైనా ఇంతవరకు సరైన సమాచారం ఇవ్వడంలేదు. చైనావల్ల మొత్తం ప్రపంచం ఇబ్బంది పడుతోంది. మూలాలు తెలియకుండా కరోనాకు శాశ్వత పరిష్కారం లభించదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనాకు చెబుతున్నప్పటికీ ఆ దేశం స్పందించడంలేదు. ఇప్పటివరకు వుహాన్ లాబ్తోపాటు పరిసర ప్రాంతాల్లో సంస్థ బృందాలు దర్యాప్తు జరిపినప్పటికీ ఇంతవరకు ఏమీ తేల్చలేకపోయాయి. తాజాగా మరోసారి దర్యాప్తు బృందం వుహాన్ వెళ్లింది. చైనా ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఎన్ని దర్యాప్తులు జరిపినా ఉపయోగం ఉండదని ప్రపంచవ్యాప్తంగా వైద్యనిపుణులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదే చివరి అవకాశమని, ఇంతకుమించి ఎన్ని దర్యాప్తులు జరిపినా అనవసరమనే ఆలోచనలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఉంది. చైనా పూర్తి వివరాలిస్తుందా? లేదా? అనేది దాని విచక్షణపై ఆధారపడివుంది.