ప్రతిరోజూ పండగే.. చమురు ధరల పెంపు!
మన దేశ గౌరవనీయులైన ప్రధానమంత్రి వర్యులు శ్రీమాన్ నరేంద్రమోడీగారు విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రజలందరికీ పెట్రోలు, డీజిల్ ధరల పెంపుతో ఒక బహుమతిని ఇచ్చారు. పండగ అందరికీ ఒకరోజే వస్తుంది. కానీ ప్రభుత్వానికి మాత్రం ప్రతిరోజూ పండగే. ప్రభుత్వానికి సంబంధం లేనట్లుగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ప్రభుత్వంతో తమకు సంబంధం లేనట్లుగా చమురు కంపెనీలు ధరలు పెంచుతాయి. కానీ వసూలైయ్యే పన్నులు మాత్రం ప్రభుత్వ ఖజానాలోకే చేరతాయి. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ను మౌనముని అంటూ విమర్శించిన నరేంద్రమోడీ ఇప్పుడు చేస్తుందేంటి? ఆయన కూడా మౌనమునిలాగే ఉన్నారు. ఆరోజు మన్మోహన్ను మౌనముని ఎందుకన్నారో మోడీకి అనుభవంలోకి వచ్చిందంటూ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పెట్రోలు, డీజిల్ తో నడిచే బళ్లను ఆపేయమంటే ఆపేస్తాం.. అంతేకానీ ఇలా ధరలు పెంచి మా నడ్డి విరగ్గొట్టదంటూ ప్రజలు వేడుకుంటున్నారు. భవిష్యత్తులో వీటి ధరలు రూ.150కి చేరే అవకాశం ఉందని మాట్లాడుకుంటున్నారు. ఆ ధరకు చేరుకుంటాయనడంలో ఎటువంటి అనుమానం అవసరంలేదు.. ఎందుకంటే ప్రస్తుత ప్రభుత్వ ఆలోచనా తీరు చూస్తే అలాగే ఉంది.