నిన్నటి వేళ రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో మోహన్ బాబుపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూనే అదే సమయంలో మోహన్ బాబు విద్యా సంస్థలపైనా విరుచుకు పడ్డారు పవన్. థియేటర్లను లాక్కున్న విధంగానే, శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థలనూ ప్రభుత్వం తన సొంతం చేసుకుంటుందా? అని ప్రశ్నించారు. వైఎస్ కుటుంబానికి సన్నిహితంగా ఉండే, బంధుత్వం కూడా ఉన్న మంచు కుటుంబ పెద్ద మోహన్ బాబు టాలీవుడ్ ఎదుర్కొంటున్న సమస్యపై ఏపీ సీఎంతో ఎందుకు మాట్లాడరని కూడా నిలదీశారు. వీటన్నింటిపై మోహన్ బాబు కౌంటర్ ఇచ్చారు. సామాజిక మాధ్యమాల్లో తన స్పందన చెప్పారు. తమ్ముడూ పవన్ కల్యాణ్ .. నువ్వు నా కన్నా చిన్నవాడివి అందుకే ఏక వచనంతో సంబోధించాను అంటూనే, తనను అనసవరంగానే ఈ వివాదంలో లాగారని, ఇదంతా తెలివితో కూడిన పని అని చెబుతూ మరికొన్ని మాటలు రాశారు ఈ ట్వీట్ లో! ఇప్పుడు మా ఎలక్షన్లు జరుగుతున్నాయని, విష్ణు మా అసోసియేషన్ ప్రెసిడెంట్ పదవికి పోటీ చేస్తున్నాడని నీకు తెలుసు అని, అక్టోబర్ పదో తారిఖుతో ఎన్నికలు అయిపోతాయని ఆ తరువాత తన స్పందన చెబుతానని పేర్కొంటూ మోహన్ బాబు తనదైన శైలిలో వ్యాఖ్యలు రాశారు. ఆఖరులో నీ అమూల్యమయిన ఓటుని నీ సోదర సమానుడైన విష్ణుకు, అతని ప్యానెల్ కు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాని అన్నారు.