దసరా తర్వాత కేసుల ప్రత్యక్ష ప్రసారం?
దసరా తర్వాత నుంచి కోర్టుల్లో కేసుల విచారణ ప్రత్యక్షంగా జరగనుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి.రమణ తెలిపారు. మహిళా న్యాయవాదుల ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు ఢిల్లీలో సన్మాన కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన జస్టిస్ రమణ మాట్లాడుతూ దసరా తర్వాత నుంచి విచారణ ప్రత్యక్షంగా జరగనుందని, దీనివల్ల న్యాయమూర్తులకు ఎటువంటి ఇబ్బంది ఉండదని, న్యాయవాదులకే ఇబ్బంది ఉంటుందన్నారు. న్యాయవిద్య కళాశాలల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని, మహిళలకు సంబంధించిన న్యాపరమైన డిమాండ్లకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు. కోర్టుల్లో మహిళా న్యాయవాదులకు అవసరమైన మౌలిక సౌకర్యాలు కల్పించాలని, కోర్టుల్లో వారికున్న సమస్యలను కూడా పరిష్కరించాలన్నారు. విజయదశమి తర్వాత కేసుల ప్రత్యక్ష ప్రసారంపై జస్టిస్ రమణ స్పష్టం చేయడంతో ఇప్పటికే కేసుల విచారణను సాగదీస్తున్నవారి గుండెల్లో రాయి పడిందని చెప్పొచ్చు. విచారణను వీక్షించడంవల్ల అసలు కేసులు ఎందుకు వాయిదా పడుతున్నాయి? అందుకు కారకులెవరు? ఏం జరుగుతోందనే విషయాలపై ప్రజలకు ఒక అవగాహన రానుంది.