'మా' ఎన్నికల్లో చిరంజీవి ఓటు నాకే: విష్ణు
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ మా ఎన్నికల్లో మెగాస్టార్ చిరంజీవి తనకే ఓటు వేస్తారని అధ్యక్ష పదవికి పోటీపడుతోన్న మంచు విష్ణు ధీమా వ్యక్తం చేశారు. ఇటీవలే విష్ణు తన ప్యానల్ను ప్రకటించి ఎన్నికల బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. మా అధ్యక్ష పదవికి ప్రకాష్రాజ్ కంటే తానే బాగా పనిచేయగలనని విష్ణు అన్నారు. అందుకే బరిలోకి దిగానని, ఇంతవరకు చిరంజీవిన కలవలేదని, మానిఫెస్టో ప్రకటించిన తర్వాత వెళ్లి కలుస్తానని, తన మానిఫెస్టో విన్నతర్వాత చిరంజీవే తనకు ఓటువేస్తారనే నమ్మకాన్ని విష్ణు వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత మా భవనాన్ని తానే సొంతంగా నిర్మిస్తానన్నారు. నిర్మాతగా తాను దెబ్బతిన్నప్పటికీ అప్పు తీసుకువచ్చి మరీ నిర్మిస్తానని స్పష్టం చేశారు. తన తండ్రి మోహన్బాబు ఇప్పటివరకు 800 మంది ఆర్టిస్టులకు ఫోన్చేసి స్వయంగా మాట్లాడారని, వారంతా సానుకూలంగా స్పందించారన్నారు. మాకు భవనం ఒక్కటే సమస్య కాదని, పలురకాల సమస్యలున్నాయని, తాను అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత కొత్త నటీనటులు పరిశ్రమలోకి వచ్చేలా చర్యలు తీసుకుంటానని, సినీ కార్మికుల పిల్లల చదువులకు సాయమందిస్తానన్నారు.