థర్డ్ జెండర్ లకు రిజర్వేషన్
లింగ మార్పిడి చేసుకున్న వారికి రిజర్వేషన్ లభించ నుంది. వీరిని వెనుకబడిన తరగతుల జాబీతా (ఓ.బి.సి) లో కీ తీసుకు రావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. వీరికి చట్టపరంగా రిజర్వేషన్లు లభించాలంటే పార్లమెంట్ లో చట్టం చేయాల్సి ఉంది. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో 'థర్డ్ జెండర్' లకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తూ బిల్లు తీసుకు రానున్నారు. ఇందుకు మార్గం సులభతరం చేసే నిమిత్తం కేంద్ర ప్రభుత్వం తాజగా కేబినెట్ నోట్ ను విడుదల చేసింది. కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ఈ నోట్ ను విడుదల చేసింది. దీని ప్రకారం ఇకనుంచి విద్యా సంస్థలు, ఉద్యోగాలలో వీరికి రిజర్వేషన్ లభించ నుంది. ఓబిసి కోటాకు ఉన్న 27 శాతం లోనే ఇది ఇమిడి ఉంటుందా మరో మార్గంలో ప్రత్యేకంగా రిజర్వేషన్ కోటా ఉంటుందా అనే వివరాలు పార్లమెంట్ సమావేశాల్లో చర్చకు వచ్చే అవకాశం ఉంది.
లింగ మార్పిడి చేసుకున్న వారి గుర్తింపు పై చాలా కాలంగా చర్చలు జరుగుతున్నాయి. జాతీయ న్యాయ సేవా సాధికార సంస్థ ఈ విషయమై పలు మార్లు కేంద్ర ప్రభుత్వం అభిప్రాయాన్ని కోరింది. అయితే భారత సర్వోన్నత న్యాయస్థానం ఒక తీర్పులో లింగమార్పిడి చేసుకున్న వారిని 'థర్డ్ జెండర్ 'లుగా గుర్తించాలని ప్రభుత్వానికి సూచనలు చేసింది. దీంతో వీరికి ప్రత్యేక గుర్తింపు వచ్చినట్లయింది. తమిళనాడు లాంటి కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే థర్డ్ జెండర్ లకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నాయి. తాజాగా కెబినెట్ నోట్ విడదల కావడంతో ముందు ముందు లింగమార్పిడి చేసున్న వారికి మరిన్ని సదుపాయాలు అందనున్నాయి.