దాడిచేసిన రెండురోజులకు హోంమంత్రి వెళుతున్నారు..!!!
గుంటూరు జిల్లా కొప్పర్రులో ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత గురువారం పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో కొప్పర్రులో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతోపాటు ఇతర ప్రాంతాల నుంచి బలగాలను కూడా రప్పించారు. తెలుగుదేశం పార్టీ వర్గీయులను పోలీసులు పెదనందిపాడు స్టేషన్కు పిలిపించి మాట్లాడారు. సోమవారం కొప్పర్రులో తెలుగుదేశం, వైసీపీ వర్గాల మధ్య వినాయక నిమజ్జనం సందర్భంగా ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. టీడీపీ మాజీ జెడ్పీటీసీ శారద ఇంటిపై వైసీపీ శ్రేణులు దాడి చేయడంతోపాటు ఇల్లు తగలబెట్టడంతోపాటు వాహనాలు ధ్వంసం చేశారు. రాత్రి పదిగంటల నుంచి పన్నెండు గంటల వరకు దాదాపు రెండుగంటలపాటు యథేచ్చగా వైసీపీ వర్గాలు దాడులకు పాల్పడ్డాయి. దాడి ఆపడానికి శారద ఇంటి లోపలికి వెళ్లిన ఎస్ ఐ కూడా రాళ్ల దాడినుంచి తప్పించుకోవడానికి లోపలే ఉండిపోయారంటే విధ్వంసం ఎలా జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో హోంమంత్రి మేకతోటి సుచరిత పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులను భారీగా మోహరింపచేశారు.