కోవిడ్ అలర్ట్ : సర్టిఫికేట్ ఉంటేనే శ్రీవారి దర్శనం

కోవిడ్ అలర్ట్ : సర్టిఫికేట్ ఉంటేనే శ్రీవారి దర్శనం
తిరుమల శ్రీవారి దర్శనం ఇప్పుడిప్పుడే అంత సులభంగా లభించేతట్టు లేదు. వెనుకబడిన ప్రాంతాల వారికి బ్రహ్మోత్సవాలలో దర్శనం కల్పిస్తామని చెప్పిన టిటిడి అధికారులు తాజా గా మెలిక పెట్టారు. దర్శనానికి వచ్చే భక్తులు రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తయిన సర్టిఫికెట్ కానీ,  కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ ను తమ వెంట తీసుకురావాలని తెల్చిచెప్పారు. ఈ మేరకు టిటిడి   చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పేరుతో ప్రకటన వెలువడించింది.
 
    తిరుమల   వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం సెప్టెంబర్ 25 వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో సర్వ దర్శనం టోకెన్లు విడుదల చేస్తామని టీటీడీ చైర్మన్ ప్రకటించారు. సెప్టెంబరు  26వ తేదీ నుంచి అక్టోబరు 31వ తేదీ వరకూ రోజుకు ఎనిమిది వేల సర్వ దర్శనం టోకెన్లు  ఆన్లైన్లో విడుదల చేస్తామని ఆయన తెలిపారు. సర్వదర్శనం టోకెన్లు ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చిన తర్వాత,  సెప్టెంబరు 26 వ తేదీ నుంచి తిరుపతి లో ఆఫ్ లైన్లో సర్వదర్శనం టోకెన్ల జారీని నిలిపి వేస్తామని  అన్నారు.   తిరుపతితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు సర్వదర్శనం టోకెన్ల కోసం గుమికూడుతుండటం వల్ల కరోనా వేగంగా సంక్రమించే ప్రమాదం ఉన్నదని తెలిపారు. అందువల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్న సర్టిఫికెట్ కానీ, దర్శనం సమయానికి మూడు రోజుల ముందు కరోనా పరీక్ష చేయించుకుని తెచ్చుకున్న నెగిటివ్ సర్టిఫికెట్ గానీ తప్పనిసరిగా తీసుకురావాల్సి ఉంటుందని చైర్మన్ వివరించారు. కోవిడ్ నియంత్రణ కోసం టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయానికి భక్తులు సహకరించాలని శ్రీ వైవి సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు.  అక్టోబరు నెలకు సబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ 300 టికెట్లు సెప్టెంబరు 24వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్లైన్ లో విడుదల చేస్తామని చైర్మన్  సుబ్బారెడ్డి తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: