వైసీపీ మద్దతుతోనే దిగుమతువున్న డ్రగ్స్?
రాష్ట్రంలో తయారవుతున్న మద్యంలో డ్రగ్స్ వినియోగిస్తున్నారని తెలుగుదేశం పార్టీ నేత బొండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ఏపీలో పోలీసులకు తెలిసే డ్రగ్స్ సరఫరా జరుగుతోందన్నారు. ఈ డ్రగ్స్ దందాలో తాడేపల్లి ప్యాలెస్కు ఎంత వెళ్లిందో తేలాల్సి ఉందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతోనే డ్రగ్స్ దిగుమతి అవుతున్నాయన్నారు. ఏపీలో జరుగుతున్న డ్రగ్స్ దందాపై విచారణ జరిపించాలని డీఆర్ ఐకి లేఖ రాస్తామన్నారు. సమాచారశాఖ మంత్రి పేర్ని నాని నిన్న హఠాత్తుగా మీడియా సమావేశం పెట్టారని, ఎందుకు పెట్టాల్సి వచ్చిందని ప్రశ్నించారు. గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లుగా ఉందన్నారు. దేశంలో ఎప్పుడూ రూ.9వేల కోట్ల విలువైన హెరాయిన్ పట్టుబడలేదని, ఇప్పుడు దాని విలువ రూ.21వేల కోట్లు అని చెబుతున్నారన్నారు. దేశంలోకి వచ్చిన రూ.70వేల కోట్ల విలువైన హెరాయిన్ ఎటువెళ్లిందని ప్రశ్నించారు. దీనిపై ఏపీ పోలీసులు ఎందుకు విచారణ చేయడంలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో డగ్స్ దందా జరుగుతుంటే డీజీపీ ఏం చేస్తున్నారని బొండా ఉమా నిలదీశారు.