తెలంగాణ వార్త : చాంద్రాయణ గుట్టలో కలకలం
కేసీఆర్ ఇలాకాలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది అన్నది ఓ పెద్ద ప్రశ్న. నిన్నటికి నిన్న చిన్నారి చైత్ర హత్యోదంతం మరువక ముందే కళ్లెదుటే పాతబస్తీలోనూ, ఇంకొన్ని ప్రాంతాల్లోనూ అత్యాచార ఘటనలు వెలుగులోకి వచ్చాయి. హత్యలకు సంబంధించి రోజుకో కేసు అన్ ట్రేసెడ్ జాబితాలో చేరిపోతోంది. జంట నగరాల పరిధిలో గుర్తు తెలియని మృతదేహాల సంఖ్య పై ఇంకా అనుమానాలు ఉన్నా అవి నివృత్తి కావడం లేదు. వీటితో పాటు హత్యా రాజకీయాలు, ఆస్తి తగాదాలు, ల్యాండ్ మాఫియా, డ్రగ్ రాకెట్, మానవ అక్రమ రవాణా, దందాలు, దోపిడీలూ ఇలా ఒక్కటేంటి ఎన్నో వెలుగు చూసినా అవన్నీ పరిష్కారానికి నోచుకోని కేసులుగానే స్టేషన్ల పరిధిలో పోలీసుల ఫైళ్లలో దాగి ఉంటున్నాయి. వీటిని ఛేదించ లేక తలలుపట్టుకుంటున్నారు. వీటికి తోడు సైబర్ నేరాలు రోజుకో మలుపు తీసుకుంటున్నాయి. వీటితో పాటు గృహ హింస కేసులు ఉండనే ఉన్నాయి. ముఖ్యంగా ల్యాండ్ సెటిల్ మెంట్లపై నెలకొన్న వివాదాలకు అడ్డూ అదుపే లేదు. నిన్న కూడా ఓ జంట దుండగుల బారీ నుంచి అత్యంత చాకచక్యంగా బంధువుల సహకారంతో తప్పించుకుంది. కొద్ది సేపు ఆలస్యం అయితే బంధువులు రాకపోయి ఉంటే వారు కూడా శవాలై తేలేవారే! మరి! నగరంలో నిజాయితీ ఉన్న పోలీసులు ఇంత మంది ఉన్నా కూడా నేరాల నియంత్రణ అన్నది పెను సవాలుగా మారుతోంది.
ఈ నేపథ్యంలో
హైద్రాబాద్ నగర పరిధి, చాంద్రాయణ గుట్టలో కలకలం రేగింది. గుర్తు తెలియని మృతదేహం ఒకటి లభ్యమైంది. నిర్మానుష్య ప్రాం తం లో దుండగులు వ్యక్తిని హత్య చేశారని, నగ్నంగా ఉన్న దేహంపై కత్తిపోట్లు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం కేసు ను దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.