వైసీపీలో అసమ్మతి? ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే.!
రాజమండ్రి ఎంపీ భరత్రామ్ను ఉద్దేశించి తూర్పుగోదావరి జిల్లా రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోని ఒక నేత తెలుగుదేశం పార్టీ నేతలతో కుమ్మక్కై తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ ఆరోపించారు. రాజమండ్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజా మాట్లాడుతూ పార్టీకి నష్టం కలిగించేవారిని, చెడ్డపేరు తీసుకువచ్చేవారిని దూరంగా పెడితే వారిని తీసుకువచ్చి అలజడి సృష్టిస్తున్నారని, దీనివల్ల వైసీపీ నష్టం కలిగే పరిస్థితి ఏర్పడిందన్నారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి రైతులకు పరిహారం చెల్లించాల్సి ఉందని, కొందరు రైతులతో రాజమండ్రిలో బ్యాంకు ఖాతాలు తెరిపించి వసూళ్లకు పాల్పడుతున్నారని విమర్శించారు. సీతానగరానికి చెందిన ఉపాధ్యాయుడు ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొంటుండటంతో అతణ్ని సస్పెండ్ చేశారని, ఆ ఉపాధ్యాయుడికి మద్దతు పలకడం సరికాదన్నారు. అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేని మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ ఇప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.