ఓటుతోపాటు బీరు కోసం లేఖ..!!
నిన్న పరిషత్ ఎన్నికల కౌంటింగ్ జరిగి ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే. సాధారణంగా బ్యాలెట్ పేపర్ల ద్వారా జరిగే ఎన్నికల్లో కొన్ని విచిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంటూ ఉంటాయి. అవి మనం చూస్తేనే ఉంటాం. కొంతమంది ఓటర్లు తమ డిమాండ్లను ఓ కాగితంపై రాసి బ్యాలెట్ బాక్సుల్లో వేస్తుంటారు. ఇలాంటి చిత్రమైన సంఘటన ఒకటి అనంతపురం జిల్లాలో జరిగింది. నల్లచెరువు మండలంలోని ఓట్ల లెక్కింపు కేంద్రంలో ఓట్లను లెక్కిస్తున్న సిబ్బందికి బ్యాలెట్ బాక్సులో ఓ కాగితం దొరికింది. నల్లచెరువు మద్యం దుకాణాల్లో చల్లటి బీరు లేదని, కూలింగ్ బీరును ఉంచాలని, అలాగే మంచి మంచి బ్రాండ్ల బీరును అందుబాటులో ఉంటే మంచిదని రాసుకొచ్చారు. నల్లచెరువు మందుబాబుల సంఘం పేరుతో ఈ లేఖ ఉండటంతో సిబ్బంది, అధికారులు షాక్ అయ్యారు. వెంటనే ఆ లేఖను వీడియోగా తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయగా అది వైరల్గా మారింది. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పేరున్న కంపెనీలవి కాకుండా ఏ తరహా మద్యం విక్రయాలు జరుగుతున్నాయో ఈ లేఖను బట్టే అర్థమవుతోందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.