'కర్రసాము'ను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం
తమిళనాడు రాష్ట్రానికి చెందిన సాహస సంప్రదాయ క్రీడ ‘సిలంబం (కర్రసాము)’ కేంద్రప్రభుత్వ అంగీకారం పొందింది. ఈ మేరకు క్రీడాభివృద్ధి శాఖ మంత్రి మెయ్యనాథన్ ఒక ప్రకటన విడుదల చేశారు. తమిళుల సంప్రదాయ సాహస క్రీడ సిలంబంను ప్రపంచస్థాయిలో విస్తరించేలా కేంద్రప్రభుత్వం అంగీకరించిందన్నారు. ‘ఖేలో ఇండియా’ ఫథకంలో అంగీకరించబడిన క్రీడల జాబితాలో ఈ క్రీడను చేర్చాలని ముఖ్యమంత్రి స్టాలిన్ కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు. దీనిని పరిశీలించిన కేంద్రప్రభుత్వ క్రీడాభివృద్ధి శాఖ గీకారం తెలిపిందన్నారు. కొత్త ఖేలో ఇండియా పథకం కింద గ్రామీణ క్రీడలను ప్రోత్సహించేలా ఈ క్రీడను జాబితాలో చేర్చినట్టు కేంద్రం ప్రకటించడం తమిళనాడుకు గర్వకారణమని మంత్రి మెయ్యనాథన్ అన్నారు. కర్రసామును అంతర్జాతీయస్థాయి సాహసక్రీడగా అభివృద్ధి చేయాలని, అందుకు తగిన గుర్తింపు, ప్రోత్సాహం ఇవ్వాలని తమిళనాడు రాష్ట్రం ఎప్పటినుంచో కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తిచేస్తూ వస్తోంది. తమ కృషి ఇన్నాళ్లకు ఫలించిందని మెయ్యనాథ్ ఆనందం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో ఎన్ని సాహసక్రీడలున్నప్పటికీ కర్రసాము మనిషిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతోపాటు ఆత్మరక్షణ కూడా కల్పిస్తుందన్నారు.