టీకాల పంపిణీలో సరికొత్త రికార్డు?
దేశంలో కరోనా క్రియాశీల కేసుల నమోదులో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటున్నాయి. రెండురోజుల్లో నమోదైన కేసుల సంఖ్యతో పోలిస్తే గడిచిన 24 గంటల వ్యవధిలో 30వేల కేసులు నమోదయ్యాయి. నమోదైన మరణాల సంఖ్య 300 వరకు ఉంది. మరోవైపు టీకా కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు టీకా పంపిణీ చేస్తోంది. ఇప్పటివరకు 80 కోట్ల డోసులు పంపిణీ అయి కొత్త రికార్డు నమోదైంది. నిన్న ఒక్కరోజే కరోనాతో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 309గా ఉండటంతో ఇప్పటివరకు ఈ మహమ్మారి బారినపడి మృతిచెందినవారి సంఖ్య 4,44,838కి చేరింది. దేశంలో క్రియాశీలకంగా ఉన్న కేసులు ఒకశాతం దిగువకు చేరాయి. పాజిటివిటీ 0.99గా నమోదైంది. శనివారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 85 లక్షల మందికి పైగా కరోనా టీకాలు వేశారు. దీంతో ఇప్పటివరకు టీకా డోసుల సంఖ్య 80కోట్లకు పైగా చేరింది. మొన్న ప్రధానమంత్రి జన్మదినం సందర్భంగా టీకా కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఒక్కరోజులోనే రెండున్నర కోట్ల డోసులు పంపిణీ చేసిన ఆరోగ్యశాఖ రికార్డు నెలకొల్పింది.