పంజాబ్ కొత్త ముఖ్యమంత్రి ఎవరంటే?
పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరిందర్ సింగ్ తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈరోజు మధ్యాహ్నానికి కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక చేయాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. శాసనసభా పక్ష నేతలు భేటీ నిర్వహించి సీఎంను ఎంపిక చేయబోతున్నారు. సిద్ధూను ముఖ్యమంత్రిగా ఎంపికచేస్తే కాంగ్రెస్ పార్టీకి, దేశానికి నష్టదాయకమని అమరిందర్సింగ్ మండిపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లోను సిద్ధూను ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడానికి తాను అంగీకరించేదిలేదని స్పష్టం చేశారు. దీనివల్ల కొత్త తలనొప్పులు వస్తాయని భావిస్తోన్న అధిష్టానం నలుగురి పేర్లు పరిశీలిస్తోంది. పీసీసీ మాజీ అధ్యక్షులు సునీల్ జాఖడ్, ప్రతాప్సింగ్ బజ్వాతోపాటు మాజీ ముఖ్యమంత్రి రాజిందర్కౌర్ భట్టల్, తాజా మాజీ మంత్రి సుఖ్జిందర్సింగ్ రంధ్వా పేర్లు పరిశీలిస్తున్నారు. ఎంపిక చేసే అధికారం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ చేతిలోనే ఉంది. వీరితోపాటు మాజీ ముఖ్యమంత్రి బేయంత్సింగ్ మనుమడు రన్వీత్సింగ్ పేరు కూడా వినిపిస్తోంది. అయితే ఎవరిని ఎంపిక చేస్తారనేది ఉత్కంఠ భరితంగా మారింది. ఈ రోజు మధ్యాహ్నానికి వీరిలో ఒకరిపేరు ఖరారుకానుంది.