జగన్ ఇంటికి వెళ్లే దారుల మూసివేత
తాడేపల్లిలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఇంటివైపు వెళ్లే అన్ని రహదారులను పోలీసులు మూసేశారు. ఆయా రహదారులవద్ద భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. జగన్ ఇంటివద్ద కూడా భద్రత భారీగా పెంచారు. తాడేపల్లివైపు వచ్చే వాహనాలన్నింటినీ జాతీయ రహదారిపైకి మళ్లించారు. ఉండవల్లిలో ప్రతిపక్షనేత చంద్రబాబు ఇంటిపైకి పెడన ఎమ్మెల్యే జోగి రమేష్, వైసీపీ కార్యకర్తలు దాడికి ప్రయత్నించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసు బలగాలను చంద్రబాబు ఇంటికి భారీగా తరలించారు. కర్రలు, రాళ్లు తీసుకొని వచ్చారంటూ తెలుగుదేశం శ్రేణులు ఆరోపించాయి. నా కారు అద్దాలు తెదేపా శ్రేణులు పగలగొట్టాయంటూ ఎమ్మెల్యే జోగి ప్రత్యారోపణ చేశారు. ఈ నేపథ్యంలో తాడేపల్లిలోని జగన్ ఇంటివద్దకు తెలుగుదేశం శ్రేణులు దూసుకొచ్చే అవకాశం ఉండటంతో అక్కడ భద్రతను పెంచారు. ప్రతిపక్ష నేత ఇంటిపైకి దాడికి వెళ్లడానికి సంబంధించి విమర్శలు వస్తున్నాయి.