తాడేపల్లి పోలీస్స్టేషన్ వద్ద ఉద్రిక్తత?
తాడేపల్లి పోలీస్స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు స్టేషన్కు భారీగా తరలివస్తుండటంతో అక్కడ పోలీస్ బందోబస్తును భారీగా పెంచారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంపై దాడికి సంబంధించి ఫిర్యాదు చేయడానికి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తోపాటు ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, పార్టీ నేతలు స్టేషన్లోకి వెళ్లారు. దాడికి సంబంధించిన ఘటనపై వీరు పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. పోలీస్ స్టేషన్ బయట తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. వైసీపీ డౌన్డౌన్.. జగన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంపై వైసీపీ నేతలు జెండాలు, కర్రలతో దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో కృష్ణా జిల్లా పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ కూడా పాల్గొన్నారు. తెలుగుదేశం, వైసీపీ శ్రేణుల మధ్య వివాదంతోపాటు తోపులాటలు జరిగాయి. అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా ఉండటంతో ఎటువంటి గొడవలు జరగకుండా పోలీసులు భారీబందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతిపక్ష నేత ఇంటిపైకి దాడికి దిగడానికి సంబంధించి అన్నివైపుల నుంచి ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి.