రెండురోజుల్లో రూ.1100 కోట్ల అమ్మకాలు?
విద్యుత్తు స్కూటర్ల అమ్మకాల్లో ఓలా సంస్థ సంచలన రికార్డు నెలకొల్పింది. రెండు రోజుల్లో ఏకంగా రూ.1,100 కోట్లు విలువ చేసే స్కూటర్లు అమ్ముడైనట్లు సంస్థ సహ వ్యవస్థాపకుడు భవీశ్ అగర్వాల్ తెలిపారు. భారీ ఆర్డర్ల నేపథ్యంలో గురువారం అర్ధరాత్రి నుంచి విక్రయాల ప్రక్రియ నిలిపివేశామని, దీపావళి పర్వదినం సందర్భంగా నవంబరు 1న విక్రయాలు పునఃప్రారంభమవుతాయని వెల్లడించారు. ఆన్లైన్లో బుధవారం ఉదయం నుంచి ఓలా స్కూటర్ల విక్రయాలు ప్రారంభమవగా తొలి 24 గంటల్లో సెకనుకు 4 స్కూటర్ల చొప్పున రూ.600 కోట్లు విలువ చేసే స్కూటర్లు అమ్ముడుపోయాయి. రెండో రోజు నాటికి ఆ విక్రయాలు రూ.11,00 కోట్ల విలువకు చేరుకోవడంతో వాహన రంగ చరిత్రలోనే ఇదో రికార్డని భవీశ్ అన్నారు. ఈ-కామర్స్లో ఒక ఉత్పత్తికి విలువపరంగా ఈ స్థాయి స్పందన రావడం కూడా చరిత్రలో నిలిచిపోతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆగస్టు 15న ఆవిష్కరించిన ఓలా, జులై నుంచే రూ.499తో ముందస్తుగా బుక్ చేసుకోవడానికి సంస్థ అవకాశం కల్పించింది. ఆ సమయంలో 24 గంటల వ్యవధిలో లక్షకు పైగా బుకింగ్లు వచ్చినట్లు వెల్లడించింది.