తితిదే బోర్డులో నేరస్తులు, అవినీతిపరులు?
రాజకీయ నిరుద్యోగులకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డును పునరావాసంగా మార్చారని, జంబో బోర్డును తక్షణమే రద్దుచేయాలని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామివారికి సేవ చేసుకునేందుకు భక్తిభావం, సేవాస్ఫూర్తి కలిగినవారిని ఎంపిక చేయాల్సిన బోర్డులో నేరస్తులు, కళంకితులు, అవినీతిపరులు, పారిశ్రామికవేత్తలకు చోటు కల్పించారని మండిపడ్డారు. తితిదేకు సంబంధించి ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉంటున్నాయంటూ ఆయన ముఖ్యమంత్రి జగన్కు లేఖ రాశారు. తిరుమల అంటేనే సనాతన హైందవ ధర్మానికి ప్రతీక అని, అటువంటి పవిత్ర క్షేత్రాన్ని వ్యాపార సంస్థగా మార్చడం అత్యంత బాధాకరమన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం సంప్రదాయాలను పాటిస్తూ నూతన ధర్మకర్తల మండలిని వెంటనే ఏర్పాటు చేయాలని చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. ఏ ముఖ్యమంత్రి హయాంలో కూడా ఇంత జంబోబోర్డును ఏర్పాటు చేయలేదని, తక్షణమే బోర్డును రద్దుచేయాలని కోరారు.