తిరుమల శ్రీ వారి బ్రహ్మోత్సవాలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు సంవత్సరాల అనంతరం తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు భక్తుల మధ్య నిర్వహిస్తున్న నేపధ్యంలో పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. బ్రహ్మోత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు విచ్చేసే అవకాశం ఉన్నందున దానికి తగినట్లుగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. బ్రహ్మోత్సవాలకు నాలుగు వేల మంది సిబ్బందితో భద్రత చేపట్టారు. గరుడసేవ రోజు మరో రెండు వేల మంది అదనపు సిబ్బందిని వినియోగించనున్నారు. గరుడ సేవ రోజు తిరుమలకు ద్విచక్రవాహనాలకు అనుమతి లేదు.
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై తితిదే అన్ని విభాగాల అధికారులతో తిరుమల అన్నమయ్య భవనంలో ఈవో ధర్మారెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. రెండేళ్ల తర్వాత మాడ వీధుల్లో భక్తుల సమక్షంలో వాహనసేవలు జరుగనున్నాయి. ప్రతి ఉద్యోగీ బాధ్యతగా తమ విధులు నిర్వహించాల్సిన సమయం ఇది. అక్టోబర్ 1న గరుడ సేవ నాడు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని ఈవో సూచించారు.