యూపీలో రెండోసారి అధికారంలోకి వచ్చిన యోగి ఆదిత్యనాథ్ ఈసారి చాలా మందికి చుక్కులు చూపిస్తున్నారు. తన పాలనలో సరికొత్త మార్పులు తీసుకువస్తున్నారు. ఇకపై ప్రజాప్రతినిధులు, అధికారులు తమ ఆస్తుల వివరాలను మూడు నెలల్లో ప్రకటించాలని యోగి ఆర్డర్ వేశారు. యోగి ఆధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఐఏఎస్, ఐపీఎస్, ప్రొవెన్షియల్ సివిల్ సర్వీస్ అధికారులు కూడా తమతో పాటు తమ కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలనూ ఆన్లైన్ పోర్టల్లో ప్రజలకు అందుబాటులో ఉంచాలని యోగి నిర్ణయించారు. చక్కటి ప్రజాస్వామ్యం కోసం ప్రజాప్రతినిధుల ప్రవర్తన ఎంతో ముఖ్యమని యోగి అంటున్నారు. అందుకే మంత్రులంతా తమతో పాటు తమ కుటుంబ సభ్యుల ఆస్తులు వివరాలను కూడా ప్రకటించాలని ఆదేశించారు. ఇప్పుడు ఈ యోగీ ఆదేశాలు చూసి మంత్రులు, అధికారుల, ఎమ్మెల్యేలు అంతా లబోదిబో మంటున్నారు. అయితే పైకి మాత్రం ఎవరూ ఆ మాట చెప్పే సాహసం చేయట్లేదు. ఇలాంటి నిర్ణయాలతో యోగి తన ప్రజాబలం మరింత పెంచుకుంటున్నారు.