నరేంద్ర మోదీ సర్కారు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ అగ్ర నేతలను టార్గెట్ చేస్తోందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన మనీలాండరింగ్ అక్రమాల కేసును బీజేపీ సర్కారు ఆయుధంగా వాడుకుంటోందన్న విమర్శలు వస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించిన ఇప్పటికే పలువురు కాంగ్రెస్ నేతలను ఈడీ విచారించింది. తాజాగా కాంగ్రెస్ నేత పవన్ కుమార్ బన్సల్ను కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం బన్సల్ వాంగ్మూలాన్ని ఈడీ నమోదు చేసింది. విచారణకు బన్సల్ తనతో పాటు కొన్ని పత్రాలు తీసుకువచ్చారు. ఈ కేసులో ఇప్పటికే మరో కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గేను ఈడీ విచారించింది కూడా.
అసలు ఇంతకీ కేసు ఏంటంటే.. యంగ్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ యాజమాన్యంలోని అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ గతంలో నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రచురించేది. యంగ్ ఇండియాకు ఖర్గే సీఈవోగా ఏజెఎల్కు బన్సల్ ఎండీగా పని చేశారు. ఇదే యంగ్ ఇండియాలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ ప్రమోటర్లు, వాటాదారులు కూడా . ఈ సంస్ధల్లో అక్రమ లావాదేవీలు జరిగాయంటూ 2013లో ఈడీ కేసు నమోదు చేసింది.