పోలీస్ వాహ‌నానికి యాక్సిడెంట్‌.. సీఐ మృతి

N ANJANEYULU
విధి వక్రీకరించడంతో విధులు ముగించుకొని ఇంటికి చేరుకోవడానికి వెళ్తున్న‌ సీఐ  కొద్ది క్ష‌ణాల్లోనే అనంతలోకాలకు వెళ్లాడు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం సమీపంలో ఓఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకోవ‌డంతో ఈ విషాద ఘ‌ట‌న చోటు చేసుకున్న‌ది.  విశాఖ‌ప‌ట్ట‌ణంలోని త్రీటౌన్‌లో సీఐగా విధులు నిర్వహిస్తున్న ఈశ్వరరావు గురువారం తెల్ల‌వారుజామున విధులు ముగించుకొని  ఇంటికి బయలు దేరారు. ఎండాడ వద్ద గల జాతీయ రహదారిపై  ఉద‌యం 3.40 గంటలకు గుర్తుతెలియని వాహనం వచ్చి సీఐ ఉన్న పోలీసు వాహనాన్ని ఒక్క‌సారిగా ఢీ కొట్టింది. దీంతో సీఐ  ఈశ్వ‌ర‌రావు అక్కడికక్కడే మృతి చెందారు.
సీఐతో పాటు వాహ‌నంలో ఉన్న  కానిస్టేబుల్‌ సంతోష్ కు తీవ్రంగా గాయాలు అయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంట‌నే ఘ‌ట‌న‌ స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించామ‌ని..  పోలీస్ వాహ‌నాన్ని ఢీ కొట్టిన‌ వాహనం గురించి  ఆరా తీస్తున్నట్టు  పోలీసులు పేర్కొంటున్నారు. ఘ‌ట‌న చోటు చేసుకున్న‌ సమీపంలో ఉన్న‌టువంటి సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. సీఐ ఈశ్వరరావు మృతి దురదృష్టకరమని సీపీ మనీష్‌ కుమార్‌ సిన్హా పేర్కొన్నారు.  పదవీ విరమణకు రెండేళ్లు స‌మ‌యం ఉన్న తరుణంలో ఈ ప్రమాదం చాలా  బాధకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు.  ప్రమాదంలో గాయపడిన కానిస్టేబుల్‌ సంతోష్‌ పరిస్థితి  నిలకడగా ఉందని వైద్యులు వెల్ల‌డించిన‌ట్టు స‌మాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: