రైతుల ఆత్మహత్యలలో తెలంగాణ నాలుగో స్థానం : బండి సంజయ్
ఢిల్లీలో చనిపోయిన రైతులకు కేంద్రప్రభుత్వం రూ.25లక్షలు ఇవ్వాలని కేసీఆర్ పేర్కొంటున్నాడని.. కన్నతల్లికి కోక కొనని వాడు.. పినతల్లికి బంగారు గాజులు పెట్టినట్టు ఉంది కేసీఆర్ తీరు అని మండిపడ్డారు బండి సంజయ్. దేశంలో రైతుల ఆత్మహత్యల విషయంలో తెలంగాణ రాష్ట్రం నాలుగవ స్థానంలో ఉందని.. 2019లో 419 రైతులు, 2020లో 471 రైతులు ఆత్మహత్య చేసుకున్నారని వెల్లడించారు. రైతులు ఆత్మహత్య చేసుకున్నవారందరికీ కేసీఆర్ రూ.20లక్షలు ఇస్తాడా అని బండి ప్రశ్నించారు. ప్రతి విషయానికి తెలంగాణ సెంటిమెంట్ జోడిస్తాడని ఆరోపించారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు వాస్తవం కాదా..? రైతుల ఇబ్బందులు వాస్తవం కాదా అని నిలదీసారు. ధాన్యం తడిసినా.. మొలకలు వచ్చినా వెంటనే కొనాలని, బోనస్ రూ.500 ఇవ్వాలని తాను డిమాండ్ చేస్తున్నట్టు వ్యాఖ్యానించారు బండి సంజయ్.