శ్రీమంతుడు సినిమా స్పూర్తితో నిర్మించిన బీబీపేట పాఠశాలను కళాశాలగా ఏర్పాటు చేస్తాం అని తెలంగాణ పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. మా నాయనమ్మ ఊరు అయిన పోసానిపల్లిలో కూడ ప్రాథమిక పాఠశాలను నిర్మిస్తాను అని పేర్కొన్నారు మంత్రి కేటీఆర్. టాలీవుడ్ హీరో మహేశ్బాబు సినిమా శ్రీమంతుడు ఇలాంటి గొప్ప కార్యక్రమాలకు ఆదర్శంగా నిలవడం గర్వించదగ్గ విషయం అని పేర్కొన్నారు.
బీబీపేట పాఠశాలను కళాశాలగా ఏర్పాటు చేస్తున్న తరుణంలో కళాశాల ప్రారంభోత్సవానికి మహేశ్బాబును అతిథిగా తీసుకొస్తాం అని వెల్లడించారు కేటీఆర్. దాని వల్ల మరింత మంది స్పూర్తి పొందుతారని తెలిపారు. సుభాష్రెడ్డిని స్పూర్తిగా తీసుకొని గ్రామాలను దత్తత తీసుకోవాలని సూచించారు కేటీఆర్. రూ. 6కోట్లతో ఇలాంటి పాఠశాలను నిర్మించడం చాలా గొప్ప విషయం అని కొనియాడారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో విద్యుత్ కోతలు లేకుండా సాగునీరు, త్రాగునీరు విషయంలో రికార్డు సృష్టిస్తున్నాం అని కేటీఆర్ వెల్లడించారు.