బద్వేలు మ్యాచ్ పూర్తయింది. ముందుగానే నిర్ణయించిన ప్రకారం మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంటలోపే తుది ఫలితం ఒకటి తేలిపోయింది. ఈ ఎన్నికల్లో వైసీపీ ఆశించిన మెజార్టీ సాధించకున్నా మంచి ఫలితమే అందుకుంది. ఆ తృప్తిలోనో ఆ సంతోషంలోనో పెద్దిరెడ్డి, రోజా రెడ్డి, అవినాశ్ రెడ్డి ఇంకా తదితరులు స్వీట్లు పంచుకుంటున్నారు. యువ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాత్రం కొంచెం అసంతృప్తిగానే ఉన్నారని తెలుస్తోంది. బద్వేలులో ఫ్యాన్ గాలి ప్రభంజనం సృష్టించాలని, తుఫాను హోరు వినిపించాలని ఇలాంటివేవో జగన్ గతంలో మంత్రులకు చెప్పారు. తన సోదర నాయకులకు చెప్పారు. కానీ ఇప్పుడు నిర్దేశించిన లక్ష్యం చేరుకోలేక వైసీపీ లీడర్లు చతికిలపడ్డారు. పోలింగ్ శాతం కూడా పెద్దగా ఆశాజనకంగా లేదు. హుజురాబాద్ తో పోలిస్తే ఇక్కడ పోలింగ్ శాతం కూడా తక్కువే. అక్కడ ఎనభై శాతంకు పైగా పోలింగ్ నమోదు అయితే ఇక్కడ అరవై శాతంకు పైగా పోలింగ్ నమోదైంది. ఇక టీడీపీ లాంటి ప్రధాన పార్టీలు ఈ పోరులో లేకపోయినా సంబంధిత నాయకులంతా బీజేపీకి పోలింగ్ ఏజెంట్లుగా వ్యవహరించారన్న ఆరోపణలు వాట్సాప్ గ్రూపులలో హల్ చల్ చేశాయి. అందుకు తగ్గ ఆధారాలు కూడా కొన్ని చోట్ల బయటపడ్డాయి. ఆవిధంగా బద్వేలులో బీజేపీ 21 వేలకు పైగా ఓట్లు తెచ్చుకుని డిపాజిట్లు తెచ్చుకుని పరువు నిలుపుకుని హాయిగా ఊపిరిపీల్చుకోగలిగింది. ఈ విషయంలో ఓ విధంగా బీజేపీ లీడర్ ఆది నారాయణ రెడ్డి కాస్త రిలీఫ్ కావొచ్చు. అయితే జనసేన ప్లస్ టీడీపీ = బీజేపీ అన్న ఈక్వేషన్ ఈ ఉప ఎన్నిక నిరూపించడంతో వైసీపీ వర్గాలు విస్తుబోతున్నాయి. టీడీపీ నాయకులు బీజేపీకి ఎలా పోలింగ్ ఏజెంట్లుగా పనిచేస్తారని కొన్ని చోట్ల నిలదీసినా కూడా ఫలితం లేకపోయిందని తెలుస్తోంది. ఏ విధంగా చూసుకున్నా బీజేపీ పరువును బాబు దగ్గరుండి కాపాడి తన పరువును కూడా పనిలో పనిగా కాపాడుకుని డిజాస్టర్ గా నిలవకుండా జాగ్రత్త పడ్డారు.