ఉమ్మడి అభ్యర్థి నిజమేనా?
హైదరాబాద్ గోల్కొండ హోటల్లో హుజూరాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి భేటీ అవడం వెనక ఆంతర్యం ఏమిటని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఇరుపార్టీలు కలిసి ఉమ్మడి అభ్యర్థిగా రాజేందర్ను నిలబెట్టాయని తెలంగాణ రాష్ట్రసమితి కొద్దిరోజులుగా ఆరోపణలు చేస్తోన్న సంగతి తెలిసిందే. దీనిపై కేటీఆర్ ఈరోజు మరోసారి స్పందించారు. హుజూరాబాద్లో తెలంగాణ రాష్ట్ర సమితిని నిలువరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఎన్నికల సంఘం తన పరిధిని దాటి ప్రవర్తిస్తోందని ఆరోపించారు. ఈటెల, రేవంత్రెడ్డి కలయిక వెనక ఉన్న మతలబు ఏమిటని ఆయన ప్రశ్నించారు. తామే వీరిద్దరూ కలుసుకున్న ఆధారాలను త్వరలోనే బయటపెడతామన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటంతో ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకొని తెరాసను బలహీనపరచాలని ప్రయత్నిస్తున్నారని, ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్న తెరాసను ఎవరూ ఓడించలేరన్నారు. ఈటెల కోసమే కాంగ్రెస్ బలహీన అభ్యర్థిని నిలబెట్టిందని, ఇంతకంటే రుజువు ఏంకావాలని ఆయన ప్రశ్నించారు.