ఓటింగ్ శాతం పెరుగుదలపై ఆనందంగా ఉంది.. అందరూ నవ్వుతూ వచ్చారు అందరూ కౌగిలించుకున్నారు..కానీ ఓటరు మనసులో ఏముందన్నది కౌంటింగ్ లోనే తెలుస్తుంది..అని ప్రకాశ్ రాజ్ అన్నారు. మా ఎన్నికలకు సంబంధించి ఎన్నడూ లేని విధంగా అనూహ్య రీతిలో ఓటర్లు స్పందించారు. అదేవిధంగా ఇరు పక్షాలూ చేసిన విమర్శలూ, ప్రతి విమర్శల ప్రభావం కూడా స్పష్టంగానే ఉంది. బాలయ్య మొదలుకుని తారక్ వరకూ విభిన్న రీతుల్లో స్పందించడంతో ఎవరు ఎటు అన్నది తెలియక చాలా మంది తిక మక పడ్డారు. చిరంజీవి తరఫున ప్రకాశ్ రాజ్ కు బాహాటంగానే మద్దతు ఉన్నప్పటికీ పోల్ సీన్ వచ్చేసరికి పవన్ వచ్చి మోహన్ బాబు ఆయన కుమారులతో హాయిగా నవ్వుకుని మాట్లాడి, కౌగిలించుకుని వెళ్లడంతో ఈ దృశ్యాలు మీడియాలో ప్రధానంగా హైలెట్ అయ్యాయి. సాక్షాత్తూ చిరు, పవన్ లాంటి వారే విభేదాలు అటుంచి అందరినీ పేరు పేరునా పలకరించి వెళ్లడం పోలింగ్ ప్రారంభ సమయంలో శుభ పరిణామం అని ఇరు వర్గాలూ సంతోషించాయి. జయ ప్రద, జెనీలియా, రోజా లాంటి నటులు
గత కొద్దికాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా, ఓటింగ్ లో పాల్గొని తమదైన హుందాతనం చాటి వెళ్లారు. మరోవైపు ఆర్ నారాయణ మూర్తి లాంటి నటులు, శివాజీ లాంటి నటులు విమర్శలు చేసి వెళ్లారు. తెలుగు కళాకారులకు ప్రాధాన్యం ఇవ్వండని నారాయణమూర్తి కోరగా, అన్నింటాలానే ఇక్కడా అవినీతి ఉందని అన్నారు శివాజీ. ఇవేమయినా సీఎం ఎన్నికలా ఇంతలా కొట్టుకుంటున్నారంటూ నవ్వుతూ తనదైన శైలిలో మీడియా ఎదుట వ్యాఖ్యలు చేసి వెళ్లారు.