ఇప్పటికి సరే.. తర్వాత ఏడాది ఎలా?
ఈ ఏడాదికి హుస్సేన్సాగర్లో వినాయక నిమజ్జనానికి సుప్రీంకోర్టు అనుమతులు మంజూరు చేసింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన విగ్రహాలను సాగర్లో నిమజ్జనం చేయడంవల్ల కాలుష్యం పెరుగుతోందని, దీన్ని అరికట్టాలంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై స్పందించిన కోర్టు నిమజ్జనానికి అనుమతులు మంజూరు చేయలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం తలుపు తట్టింది. ఈ సంవత్సరం వరకు మాత్రం నిమజ్జనం చేసుకోవచ్చంటూ సర్వోన్నత న్యాయస్థానం అనుమతించింది. ప్రతి ఏడాది హుస్సేన్సాగర్లో వినాయక నిమజ్జనంవల్ల నీళ్లు కాలుష్యభరితంగా మారుతున్నాయని, వీటిని ఎట్టి పరిస్థితుల్లోను అనుమతించవద్దంటూ కొన్ని స్వచ్ఛంద సంస్థలు కోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. హైదరాబాద్ లో వినాయక చవితి వేడుకలు పెద్ద ఎత్తున జరుగుతాయి కాబట్టి నిమజ్జనానికి హుస్సేన్ సాగర్ ఒక్కటే ఉందని, అది కూడా కాలుష్యమైతే నగరానికి నీటి ఎద్దడి ఏర్పడుతుందని వీరంతా కోర్టు దృష్టికి తెచ్చారు. తర్వాత సంవత్సరం నిమజ్జనానికి ప్రభుత్వం ఎటువంటి ఏర్పాట్లు చేయబోతోందనే విషయంలో మాత్రం కాస్తంత ఆసక్తి ఏర్పడింది. నిమజ్జనానికి హుస్సేన్సాగర్ ఒక్కటే తప్పితే మరే మార్గం లేదు.