అబద్దాల్లో.. తండ్రిని మించిన తనయుడు?
అబద్దాల్లో తండ్రిని మించిన తనయుడయ్యాడంటూ మంత్రి కేటీఆర్పై మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వాల్మీకి బోయలను ఎస్టీలో కలిపిన రాష్ట్ర తీర్మానం కాపీని చూపించాలని, చూపించలేకపోతే మంత్రి పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి వైదొలగాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో వాల్మీకులు, బోయల తీర్మానాన్ని, గద్వాలకు మెడికల్ కళాశాల కాపీ తీర్మానాలను కేంద్రానికి పంపించాలని సూచించారు. కేంద్రానికి పంపిస్తే తాము ఢిల్లీలో మాట్లాడి తీర్మానాల అమలుకు కృషిచేస్తామన్నారు. రాష్ట్రంలో పరిపాలన ఉందా? లేదా? అనే అనుమానం వస్తోందని, ప్రజలను మాటలతో మభ్యపెడుతూ, దళిత బంధు పథకం పేరుతో దళితులను వంచిస్తూ పరిపాలన సాగిస్తున్నారని, తండ్రీ కొడుకుల మాయమాటలను ప్రజలు తెలుసుకునే రోజు దగ్గరలోనే ఉందని, వారికి అన్నీ అర్థమవుతున్నాయని, ఈసారి ఎన్నికల్లో తెలంగాణలో అధికారం చేపట్టబోయేది భారతీయ జనతాపార్టీయేనని అరుణ స్పష్టం చేశారు.