ఓల్డ్ సిటీకి మెట్రోను తీసుకువస్తామని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. పాదయాత్రలో భాగంగా షేక్ పేట్ నాలా దగ్గర బండి సంజయ్ ప్రసంగించారు. అధికారంలోకి వచ్చాక మెదటి బహిరంగ సభ మళ్లీ భాగ్యలక్ష్మి దేవాలయం వద్దనే నిర్వహిస్తామని అన్నారు. తెలంగాణ బీజేపీ అడ్డా.. 2023లో గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగురవేసేవరకు పోరాటం చేస్తామని దీమా వ్యక్తం చేశారు. ప్రజా సంగ్రామ యాత్రకు భారీగా తరలివస్తున్న భాగ్యనగర్ ప్రజలకు తాను సెల్యూట్ చేస్తున్నా అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
పాతబస్తీకి మెట్రోరైల్ రాకుండా ఎంఐఎం పార్టీ అడ్డుకుందంటూ ఆరోపణలు చేశారు.
పాతబస్తీని ఎందుకు అభివృద్ధి చేయటంలేదో టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పాలంటూ ఆగ్రహవ వ్యక్తం చేశారు. పాతబస్తీలో హిందూ సమాజానికి బీజేపీ అండగా ఉంటోందంటూ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాతబస్తీలో బీజేపీ కోసం హిందూ సమాజం సంఘటితమవుతోందంటూ సంజయ్ దీమా వ్యక్తం చేశారు. గోరక్షణ కోసం కృషి చేస్తున్న ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసులు పెట్టడాన్ని ఖండిస్తున్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.